భారత వికెట్ కీపర్ పంత్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ల ఆగ్రహం

  • వికెట్ల వెనుక పంత్ దూకుడు
  • ఆసీస్ మాజీలు వార్న్, మార్క్ వా అభ్యంతరం
  • బౌలర్ బంతి వేసేటప్పుడు కూడా పంత్ మాట్లాడుతున్నాడని ఆరోపణ
  • బ్యాట్స్ మెన్ ఏకాగత్ర దెబ్బతీసే ప్రయత్నమని విమర్శలు
  • అంపైర్లు జోక్యం చేసుకోవాలని సూచన
ఇప్పటివరకు ఎంతోమంది భారత వికెట్ కీపర్లుగా వ్యవహరించినా, వారందరిలోకి ఢిల్లీ కుర్రాడు రిషబ్ పంత్ ఎంతో భిన్నమైనవాడు. గుండప్ప విశ్వనాథ్, సయ్యద్ కిర్మాణీ, కిరణ్ మోరె, నయన్ మోంగియా నుంచి మహేంద్ర సింగ్ ధోనీ వరకు అందరూ చాలా శాంతపరులే అని చెప్పాలి. కానీ యువరక్తం పరవళ్లు తొక్కే పంత్ మాత్రం ఎంతో దూకుడుగా ఉంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లోనూ పంత్ ఏమాత్రం తగ్గడంలేదు. సహజంగానే దూకుడుతనం ప్రదర్శించే ఆసీస్ క్రికెటర్లకు పంత్ వైఖరి మింగుడపడడంలేదు.

తాజాగా బ్రిస్బేన్ టెస్టులో పంత్ తీరును ఆసీస్ మాజీ క్రికెటర్లు షేన్ వార్న్, మార్క్ వా తప్పుబట్టారు. బౌలర్ బంతి విసిరేందుకు వచ్చే సమయంలో కూడా మాట్లాడుతూ పంత్ చిరాకు పుట్టిస్తున్నాడని, బ్యాట్స్ మెన్ ఏకాగ్రత దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొన్నారు. పంత్ ను కట్టడి చేయాలంటే అంపైర్లు జోక్యం చేసుకోక తప్పదని వారు సూచించారు.

ఇతర సమయాల్లో పంత్ ఏం మాట్లాడినా ఫర్వాలేదని, బౌలర్ రనప్ ప్రారంభించాక కూడా మాట్లాడుతూనే ఉండడం సరికాదని మార్క్ వా పేర్కొనగా, వార్న్ అతడితో ఏకీభవించాడు. వార్న్, వా బ్రిస్బేన్ టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వారు పంత్ తీరును గమనించి ఆగ్రహం వెలిబుచ్చారు.

Rishabh Pant
Shane Warn
Mark Waugh
Australia
Team India

More Telugu News